బంగ్లాదేశ్ కి తిరిగి వెళతా.. సైలెంట్గా ఉన్నానని అనుకోవద్దు: షేక్ హసీనా
- తన దేశం కోసం పోరాడుతూనే ఉంటానన్న హసీనా
- తన దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడమే తన లక్ష్యమని వ్యాఖ్య
- భారత్ – బంగ్లాదేశ్ మధ్య ఉన్న బంధం చారిత్రకమైనదన్న హసీనా
బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా సంచలన ప్రకటన చేశారు. 2024లో చెలరేగిన విద్యార్థి ఉద్యమం కారణంగా తన పదవిని కోల్పోయి, ప్రస్తుతం భారతదేశంలో ఆశ్రయం పొందుతున్న ఆమె, తాజాగా ఒక మీడియా ఇంటర్వ్యూలో తన భవిష్యత్తు కార్యాచరణను స్పష్టం చేశారు.
తనకు బంగ్లాదేశ్ అంతర్జాతీయ క్రైమ్స్ ట్రైబ్యునల్ మరణశిక్ష విధించినప్పటికీ, తన పార్టీ అయిన 'అవామీ లీగ్' పై నిషేధం విధించినప్పటికీ ఆమె ఏమాత్రం వెనక్కి తగ్గేదే లేదని ప్రకటించారు. "నేను బంగ్లాదేశ్లో లేనంత మాత్రాన సైలెంట్గా ఉన్నానని అనుకోవద్దు. దేశం కోసం నేను నిరంతరం పోరాడుతూనే ఉన్నాను. అతి త్వరలోనే నేను మళ్లీ నా సొంత దేశానికి తిరిగి వెళ్తాను" అని ధీమా వ్యక్తం చేశారు. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా తాను దేశానికి తిరిగి వెళ్లే నిర్దిష్ట తేదీ, సమయాన్ని ఇప్పుడే వెల్లడించలేనని స్పష్టం చేశారు. బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్యం, భావప్రకటన స్వేచ్ఛ, రాజకీయ హక్కులు, చట్టబద్ధమైన పాలన పునరుద్ధరించబడటమే తన ప్రాథమిక లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.
తన పార్టీ ‘అవామీ లీగ్’పై విధించిన నిషేధంపై ఆమె ఘాటుగా స్పందించారు. "అవామీ లీగ్ అనేది ప్రజల గుండెల్లో ఉన్న పార్టీ. కేవలం ఒక ప్రభుత్వ కాగితపు ఆర్డర్తో దానిని క్లోజ్ చేయడం ఎవరి తరం కాదు. అదే నిజమైతే అసలు బంగ్లాదేశ్ అనే దేశమే పుట్టేది కాదు" అని గుర్తుచేశారు. గతంలో తనపై 19 సార్లు హత్యాప్రయత్నాలు జరిగాయని, అయినా తాను ఎన్నడూ భయపడలేదని, ఇప్పటికీ లక్షలాది మంది మద్దతుదారులు పార్టీ కోసం నిలబడే ఉన్నారని చెప్పారు.